డబ్బుల వివాదంతోనే హత్య

28 Jul, 2022 07:58 IST|Sakshi

కొండాపూర్‌(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ట్రాన్స్‌ జెండర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  బుధవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీంద్రా రెడ్డి వివరాలు వెల్లడించారు.  ఎల్బీనగర్‌కు చెందిన దీపిక అంబర్‌పేటకు చెందిన సాయిహర్ష మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీపిక బోనాల పండగ సమయంలో సంపాదించిన డబ్బుతో వారు జీవనం సాగించేవారు. దీపిక ఆర్థిక లావాదేవీలు సాయిహర్ష చూసుకునేవాడు. దీపిక గతంలో సాయిహర్ష నుంచి రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుంది.

ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరడంతో  దీపిక అతడికి  దూరంగా ఉండటం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సాయిహర్ష ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న దీపిక మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కొండాపూర్‌ మండలం మారేపల్లిలో బోనాల జాతరకు హాజరైంది. దీనిపై సమాచారం అందడంతో సాయిహర్ష కూడా మారేపల్లికి వెళ్లాడు. బోనాల జాతర ముగిసిన అనంతరం మద్యం తాగి, భోజనం చేశారు. అనంతరం అందరు కలిసి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీపికకు ఎక్కువగా మద్యం తాగించిన సాయి హర్ష కారులోనే  ఆమె ప్రైవేట్‌ భాగాలపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

దీంతో నిందితుడు ఆమెను లింగంపల్లిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు.   పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సాయిహర్ష దీపిక కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఫిట్స్‌ వచ్చి దీపిక చనిపోయిందని చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి పరారయ్యాడు. దీపిక సోదరుడు సురేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొండాపూర్‌ పోలీసులు సాయిహర్షను అదుపులోకి తీసుకున్నారు.

అతడి నుంచి దీపిక పట్టా గొలుసులు, బోనం, మేకప్‌ కిట్, కారును స్వాదీనం చేసుకున్నారు. సాయిహర్షపై  అట్రాసిటీ కేసు  నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీపికతో పాటు ఇంటి నుంచి వచ్చిన మరో స్నేహితుడి శివ ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. సాయిహర్ష ఒక్కడే హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చినప్పటికీ శివపాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీఐ సంతో‹Ùకుమార్, ఎస్‌ఐ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.  

(చదవండి: మూసీ ముంచేసి..)

మరిన్ని వార్తలు