ధాన్యం కేసులో టీడీపీ నేత, మరో ఐదుగురి అరెస్ట్‌

10 Nov, 2020 05:09 IST|Sakshi

నెల్లూరు (క్రైమ్‌): రైతుల నుంచి కారు చౌకగా ధాన్యాన్ని కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ నేతతో పాటు మరో ఐదుగుర్ని నెల్లూరు రూరల్‌ సబ్‌ డివిజన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత జి.జయపాల్, మనుబోలు మండలం లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత కరియావుల మధుసూదన్‌రావు ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులు.

వీరు కొంతమంది దళారులు, రైస్‌ మిల్లర్లతో కలిసి రైతుల నుంచి అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వాటిని తామే పండించినట్టు చూపించి వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించారు. దీనిని గుర్తించిన డీఆర్‌డీఏ ఇందుకూరుపేట ఏరియా కో–ఆర్డినేటర్‌ కనుపూరు శ్రీనివాసులు ఈ నెల 3న వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు టీడీపీ నేత కరియావుల మధుసూదన్‌రావు, గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన శ్రీలక్ష్మి వెంకటసాయి మణికంఠ రైస్‌మిల్లు యజమాని బి.శ్రీనివాసరావు, కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన పి.మల్లికార్జునరెడ్డి, వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఉప్పు పద్మనాభం, వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన మస్తాన్, కిశోర్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత జయపాల్‌ పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. 

మరిన్ని వార్తలు