విషాదం: కరోనా వ్యాక్సిన్‌కు భయపడి యువకుడు..

14 Jun, 2021 23:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు వేస్తున్న టీకాపై ఇంకా ప్రజల్లో భయాలు తొలగడం లేదు. తాజాగా ఓ యువకుడు వ్యాక్సిన్‌ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాక్సిన్‌ వేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మణికొండ ప్రాంతంలో కుటుంబీకులతో కలిసి శివప్రకాశ్‌ (21) నివసిస్తున్నాడు. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని కొద్దిరోజులుగా శివప్రకాశ్‌కు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకోవడానికి శివప్రకాశ్‌ జంకుతున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబీకులు కొద్దిగా ఒత్తిడి చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టంలేని శివ ప్రకాశ్‌ జూన్‌ 12వ తేదీన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు.

మరిన్ని వార్తలు