మోసం చేసి కటకటాలపాలైన ప్రేమికుడు

3 Jun, 2021 08:40 IST|Sakshi

సహ విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటానని శారీకరకంగా లోబరుచుకున్నాడు. తీరా ఉద్యోగం వచ్చాక తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, పెద్దలు కౌన్సెలింగ్‌ ఇచ్చినా వివాహానికి నిరాకరించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

రామభద్రపురం: బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన మెరుపుల నాగేంద్ర, రామభద్రపురానికి  చెందిన ఓ విద్యార్థిని 2014 నుంచి బొబ్బిలి రాజాకళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ప్రేమగా మారింది. ఉద్యోగం వస్తే వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. మూడు నెలల కిందట ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో నాగేంద్రకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి మే 31వ తేదీన పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేశారు. నిందితుడ్ని బుధవారం అరెస్ట్‌ చేశారు. అనంతరం సాలూరుకు రిమాండ్‌ నిమిత్తం పంపిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై కృష్ణమూర్తితో కలసి సాలూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు విలేకరులకు వెల్లడించారు.

చదవండి: ప్రేమించి.. లోబర్చుకుని.. ఉద్యోగమొచ్చాక కాదన్నాడు

మరిన్ని వార్తలు