లవ్‌ బ్రేకప్‌ చెప్పడంతో ప్రియురాలిపై కత్తితో దాడి

5 Nov, 2023 07:34 IST|Sakshi

హైదరాబాద్: లవ్‌ బ్రేకప్‌ చెప్పడంతో ఓ ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వన్ష్ (21) మౌలాలి ఎంజే కాలనీలో నివసించే యువతి (21) ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఒకే స్కూల్‌లో చదువుకున్న వారు చిన్ననాటి నుంచే స్నేహంగా ఉంటూ వస్తున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారి ప్రేమికులయ్యారు. ప్రస్తుతం వారు కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అమ్మాయి లవ్‌ బ్రెకప్‌ చెప్పింది. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న వన్ష్ ప్రియురాలిని చంపి తాను కూడా చనిపోవాలని పథకం వేసుకున్నాడు. శనివారం తన ప్రియురాలికి ఫోన్‌ చేసి చివరిసారిగా ఒక్కసారి మాట్లాడుకుందా అంటూ నమ్మించి పిలిపించాడు. అలా ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు పార్కు చేసి కారు అద్దాలు వేసుకొని మాట్లాడుకున్నారు. ఎందుకు బ్రేకప్‌ చెబుతున్నావంటూ కొద్దిసేపు వాదించుకున్నారు. 

ఈ క్రమంలోనే ఒక్కసారిగా కత్తి తీసి ప్రియురాలి, పొట్ట, మెడపై విచక్షణ రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వన్ష్ కూడా పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగులగొట్టి కారు డోర్‌ తెరిచారు. వారిని స్థానిక ఎన్‌ఎఫ్‌సీ సంజీవని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హాని లేదన్నారు. 

మరిన్ని వార్తలు