వాహనం ఢీకొని వ్యక్తి మృతి

28 Mar, 2023 02:32 IST|Sakshi
మృతుడు మణి కంఠ నాయుడు (పాతచిత్రం)

పాలకొల్లు అర్బన్‌: దిగమర్రు – చించినాడ మధ్య 216 జాతీయ రహదారిపై దిగమర్రు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమాల గ్రామానికి చెందిన ఈలి మణికంఠనాయుడు (32) మృతి చెందారు. భార్య రామదుర్గతో కలిసి పాలకొల్లులో బంధువుల ఇంటికి వివాహానికి హాజరై తిరిగి వెళుతూండగా ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. చించినాడ వైపు మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న వీరిని ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన రామదుర్గ పాలకొల్లులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారి మణికంఠనాయుడుకు వివాహమై 46 రోజులైందని బంధువులు తెలిపారు. మణికంఠనాయుడు చిన్నాన్న కాశీ విశ్వనాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌వీఎం మూర్తి తెలిపారు.

లారీ ఢీకొని మహిళ మృతి

కాకినాడ రూరల్‌: ఏడీబీ రోడ్డులో లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ (65) దుర్మరణం పాలైంది. అచ్చంపేట జంక్షన్‌ నుంచి సూర్యారావుపేట లైట్‌హౌస్‌ వైపు వెళ్లే మార్గంలో పాముగుంట వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఆ మహిళను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె శరీరం నుజ్జునుజ్జయింది. వీఆర్‌ఓ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు తిమ్మాపురం ఎస్సై నాగార్జునరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు