Madhuri Dixit Political Entry: ఎంపీగా పోటీచేయనున్న ప్రముఖ హీరోయిన్‌

24 Dec, 2023 08:02 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిత్యం చర్చలు జరుగుతున్నాయి. ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా, మహారాష్ట్రలోని ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేందుకు బీజేపీ సీనియర్ నేతలతో ఆమె టచ్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను నటికి షా బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత మాధురీ దీక్షిత్ బీజేపీలో చేరుతారనే చర్చకు మరింత బలం చేకూరింది. కాబట్టి ఆమె ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం దాదాపు ఖాయం అయినట్లే. ఈ విషయంపై ఇప్పటి వరకు మాధురి ఎలాంటి స్పందనా ఇవ్వలేదు.

ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ పాలిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం సాయిబాబ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా నటి మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. ఇందులో విశేషమేమిటంటే.. అక్కడ మాధురీ దీక్షిత్ బ్యానర్ లేదా ఫ్లెక్స్ బహిరంగంగా పెట్టడం ఇదే తొలిసారి.

ముంబైలోని మొత్తం 6 లోక్‌సభ నియోజకవర్గాల్లో నార్త్-ముంబై, నార్త్ సెంట్రల్ ముంబైలు బీజేపీకి అత్యంత బలమైన రెండు నియోజకవర్గాలు. వీటిలో పూనమ్ మహాజన్ నియోజకవర్గం నార్త్ సెంట్రల్ ముంబై. ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం లోక్‌సభ నియోజకవర్గం ఎక్కువగా బీజేపీ, షిండే గ్రూపు ఆధిపత్యంలో ఉంది. పూనమ్ మహాజన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీకి అనుకూలమైనదిగా చెప్పవచ్చు.

లోక్‌సభ ఎన్నికల్లో నటి మాధురీ దీక్షిత్ బీజేపీ నుంచి ముంబైలో పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని నటి మాత్రమే కాదు బీజేపీ పార్టీ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర బావాంకులే మాట్లాడినా ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రతిపాదన జరగలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో పార్టీ నేతల నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు.

నటి మాధురీ దీక్షిత్‌కు సంబంధించిన ఆ బ్యానర్స్‌తో బీజేపీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని అక్కడి నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రముఖులకు, వ్యాపారులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి చేరవేసే పని కొన్ని నెలలుగా అక్కడి పార్టీలో సాగుతోంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. అయితే మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు