కొత్తపేట: స్థానికంగా కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో కొత్తపేట పరిసర ప్రాంతాల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, ముఖ్యంగా డయాలసిస్ రోగులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట పరిసర ప్రాంతాలలో డయాలసిస్ చేయించుకోవాలంటే సుమారు 30, 40, 70 కిలోమీటర్లు ఉన్న అమలాపురం, రాజమండ్రి, కాకినాడ వెళ్లవలసి వస్తుంది. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కొత్తపేటకు డయాలసిస్ సెంటర్ మంజూరు చేయించారు. సుమారు రూ.కోటి వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు సంబంధించి భవన నిర్మాణానికి గురువారం వైద్య విధాన పరిషత్ స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.60 లక్షలు మంజూరు చేయగా దానికి భవన నిమిత్తం ఢిల్లీకి సైతం వెళ్లి రూ.40 లక్షలు ఓఎన్జీసీ ద్వారా నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. దానిలో భాగంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఆలమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నియోజవర్గంలోని కొత్తపేట, రావులపాలెం ఆత్రేయపురం, ఆలమూరు మండల పరిధిలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేశామన్నారు. అముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీ మార్గన గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రమాదేవి, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి ముసునూరు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు పేపకాయల బ్రహ్మానందం, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు నెల్లి లక్ష్మిపతిరావు, సర్పంచులు రెడ్డి చంటి, సాగి బంగార్రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సలాది బ్రహ్మాజీ, ఏఎంసీ డైరెక్టర్ సాకా జానకీరామరాజు, జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షుడు కుర్రా శ్రీను, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల చంద్రావతి, మాజీ సర్పంచ్ పితాని రాంబాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి
కొత్తపేటకు రూ.కోటితో
డయాలసిస్ బ్లాక్ మంజూరు