'70 గంటలు పని'..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!

30 Oct, 2023 09:15 IST|Sakshi

ప్రముఖ టెక్‌ కంపెనీ ఫౌండర్‌ ఓ కార్యక్రమంలో 'యువత 70 గంటలు పనిచేస్తే'.. ఎన్నో విజయాలు సాధించొచ్చు అన్న వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనం సృష్టించాయి. ఆయనతో కొన్ని కంపెనీ సీఈవోలు ఏకీభవించగా, ఐటీ ఉద్యోగులు మాత్రం ఘాటుగా స్పందించారు. ఏదీఏమైనా ఇది అందరికీ సాధ్యమా? ఏ మనిషి అయినా అన్ని గంటలు పనికే కేటాయిస్తే ఆరోగ్య పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు దెబ్బతినవా? అది అసలు బ్యాలెన్స్‌ అవుతుందా? దీని గురించి వైద్యలు ఏం చెబుతున్నారు తదితరాల గురించే ఈ కథనం!.

దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణ మూర్తి యువత పని విషయమై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. భారత యువత వారంలో 70 గంటలు పనిచేస్తే భారత ఆర్థిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చు అని నారాయణ మూర్తి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. దీంతో నెట్టింట ప్రముఖ ఐటి ఉద్యోగులంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనికి తగ్గట్టుగా వేతనం ఇస్తే కచ్చితంగా అన్ని గంటలు చేస్తామంటూ మూర్తి వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు. ఐతే ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్‌పర్సన్ సజ్జన్‌ జిందాల్‌ వంటి ప్రముఖులు మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఏకభవించడం విశేషం.

ఇదిలా ఉండగా, నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైద్యులు సైతం విభేదించారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ దీపక్‌ కృష్ణమూర్తి మాట్లాడుతు..అసమంజసమైన పని గంటలు వల్ల దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తాయన్నారు. ఇన్ని గంటలు పనిచేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయన చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే..రోజుకు 24 గంటల షెడ్యుల్‌ ప్రకారం..వారానికి ఆరో రోజులు పనిచేస్తే..రోజుకు 12 గంటలు చొప్పున పనిచేయగా మిగిలిని 12 గంటల్లో ఓ ఎనిమిది గంటలు నిద్రకుపోగా మిగిలిని 4 గంటలు మీ వ్యక్తిగత విషయాలు, ఆఫీస్‌కు చేరుకునే జర్నీకి పోతాయి.

అదే బెంగళూరు వంటి మహానగరాల్లో అయితే రెండు గంటలు రోడ్డుపైనే గడిచిపోతాయి. అంటే ప్రశాంతంగా తినడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, వ్యాయామానికి, కనీసం వినోదానికి సమయం ఉండదు. ఇలా ఓ యంత్రంలా మనిషి చేసుకుంటూ పోతే కెరియర్‌ పరంగా ఎదుగుదల ఉంటుందేమో గానీ తనకు తెలియకుండాననే వివిధ మానసిక రుగ్మతల బారిన పడి లేని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదీగాక ఇటీవల యువత చిన్న వయసులోనే గుండెపోటుకి గురై చనిపోతున్న ఉదంతాలను ఎన్నో చూస్తున్నాం. యువకులకే ఈ గుండెపోటులు ఎందుకొస్తున్నాయో? ప్రముఖులు కాస్త ఆలోచించాలని చెబుతున్నారు.

తెలియని పని స్ట్రెస్‌ ఉద్యోగంలో అనుకున్న గోల్‌ రీచ్‌ కాలేకపోతున్నామన్న భయం మరోవైపు ఉద్యోగంలో ఎదుగుదల కోసం నానాపాట్లు ఇవన్నీ వెరసి గుండెపై ప్రభావం చూపి కార్డియాక్‌ అరెస్టులు లేదా గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. వైద్యులు మాత్రం ముందు ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసి నిరుద్యోగ సమస్యకు కళ్లెం వేయండి. యువత పని జీవితం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే మంచి లక్ష్యాలను వృద్ధిని సాధించగలరని వైద్యుడు దీపక్‌ నొక్కి చెబుతున్నారు. సదరు వైద్యుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఏకీభవించడమే గాక ఇన్ని గంటలు పని కారణంగా వ్యక్తిగత సంబంధాలు సైతం దెబ్బతింటాయని ఒకరు, లేనిపోని అనారోగ్య సమస్యలు బారినపడి భారంగా జీవనం గడపాల్సి వస్తుందంటూ రకరకాలు  కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. 

(చదవండి: పిల్లలను మంచిగా పెంచడం ఎలా? సైకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..)

మరిన్ని వార్తలు