ప్రభుత్వరంగంపై ఇంత ఏవగింపా?

19 Mar, 2021 01:29 IST|Sakshi

సందర్భం

సంపద ఎక్కడ అపరిమి తంగా పోగు పడుతుందో అక్కడ అంతే తీవ్రంగా అస మానతలు పెరుగుతాయి. అది సామాజిక అశాంతిని సృష్టి స్తుంది. సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బల హీన పరుస్తూ, సమాజంలోని కొద్దిమందికే ఉపయోగపడు తున్నాయని గత ముప్పయ్యేళ్ల ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ కాలం నిరూపిస్తున్నది.

జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షల వెలుగులో తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ వేగం పెంచడానికి, ప్రజల పేదరికం తొలగిపోవడానికి ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటైనాయి. ప్రజాస్వామ్య సోషలిస్టు వ్యవస్థ పరంగా ప్రపంచానికే ఒక శిక్షణాలయంగా మన దేశం మారాలని నెహ్రూ అనుకున్నారు. 1955లో యు.యన్‌. ఢేబర్‌ అధ్యక్షతన జరిగిన అవద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో సామ్యవాద ప్రాతిపదికగా నవ సమాజ నిర్మాణ లక్ష్యం ప్రకటితమైంది.

ఈ క్రమంలో 444 పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించారు. హిందూస్తాన్‌ మెషిన్‌ టూల్స్‌ (హెచ్‌ఎంటీ) స్థాపించిన తొలి రోజుల్లో ఉద్యోగులకు జపాన్‌లో శిక్షణ ఇప్పించారు. అది తర్వాత గడియా రాలు, ట్రాక్టర్ల తయారీలో రారాజుగా ఎదిగింది. రక్షణ, అణుశక్తి, అంతరిక్ష రంగంలో స్వావలంబన కోసం హెచ్‌ఏఎల్, బీఈఎంఎల్, బీడీఎల్, ఎన్‌ఎండీసీ వంటి సంస్థల స్థాపన జరిగింది. బొగ్గు గనులు, ముడి చమురు ఆధారిత ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, లాంటి అనేక పరిశ్రమలు ఏర్పాటైనాయి. 1991 నూతన పారిశ్రామిక తీర్మానం పరిశ్రమల్లో ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించింది. కొన్ని ప్రభుత్వ సంస్థలు కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పద్ధతు లను అమలు చేయడంలో నిర్లక్ష్యం వల్ల, మరి కొన్ని యాజమాన్యాల అవినీతి వల్ల కుంటుపడ్డాయి. నూతన ఆర్థిక విధానాలకు తెరలేపిన ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రైవేట్‌ రంగంపై పరిమితులు ఎత్తివేసి, లైసెన్స్‌ రాజ్‌ను సరళీకృతం చేసింది.

ఇక ఎన్డీయే హయాంలో పెట్టుబడుల ఉపసంహ రణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటైంది. 2014 వరకు చక్కగా పనిచేసే 200కు పైగా ప్రభుత్వ యాజ మాన్య పరిశ్రమల సంఖ్య 2019 నాటికి వందకు తగ్గింది. ఇదే కాలంలో భారత కుబేరుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. పవర్‌ గ్రిడ్, రూరల్‌ ఎలక్ట్రికల్‌ వంటి సంస్థలకు పరికరాలను సమకూర్చే బీహెచ్‌ఈఎల్‌కు ఆరేళ్ల నుండి ఎలాంటి ఆర్డర్లు రావడం లేదు. అదే సమయంలో ప్రైవేటుకు ప్రభుత్వం అపరి మిత స్వేచ్ఛను కల్పించింది. ఇవి తమకు కావాల్సిన పరికరాలను చైనా నుండి దిగుమతి చేసుకుంటు న్నాయి. రక్షణ, అంతరిక్ష రంగంలో క్షిపణులను, రాకెట్లను, తేలికపాటి హెలికాప్టర్లను తయారుచేసే హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ 2014 వరకు ఇరవై వేల కోట్ల టర్నోవర్‌ కలిగివుంది. కానీ 2019 నాటికి వెయ్యి కోట్ల అప్పుతో మిగిలింది. ప్రభుత్వం దేశీయ ప్రైవేటు సంస్థలకు రక్షణ విభాగ కాంట్రాక్టులు ఇచ్చింది.

ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికా వంటి ఆయుధ వ్యాపార దేశాల నుండి ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను బలహీనం చేసింది. లాభాదాయకంగా నడుస్తున్న ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, జీఏఐఎల్‌ లాంటి వాటిల్లో పెట్టుబడుల ఉపసంహరణకు తెగబడుతున్నారు. దీనికి పరాకాష్టగా ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయదు, అది దాని విధి కాదని విస్పష్టంగా ప్రకటించారు. వెనువెంటనే 12 ప్రభుత్వ సంస్థల ఆమ్మకానికి నీతి ఆయోగ్‌ సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జాతీ యమైన 27 బ్యాంకులను విలీనం చేస్తూ 12 బ్యాంకు లుగా మార్చారు. జాతీయ బ్యాంకుల్లో మొండి బకా యిలన్నీ ప్రైవేటు సంస్థలవే. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా అప్పులు ఎగ్గొట్టిన దాఖలా లేదు.

ఈ చర్యలు భారత రాజ్యాంగ సామ్యవాద స్ఫూర్తికి విరుద్ధమైనవి. నీరు, నేల, అడవి అన్నీ కార్పొ రేట్‌ పరం అవుతున్నాయి. ప్రజాతంత్ర వాదులు తమ బుద్ధి, సమీకరణ శక్తిని పెంచి ప్రజాస్వామ్య సోషలిజం పరిరక్షణకు పని చేయాలి. శ్రామిక వర్గాల ప్రయోజ నాల బాధ్యతను మోయాలి. సుస్థిర సమ్మిళిత అభి వృద్ధికి ప్రభుత్వ రంగమే చోదకశక్తిగా మారాలి. అవి జాతి జనులకు అందాలి.

-అస్నాల శ్రీనివాస్‌ 
వ్యాసకర్త దొడ్డి కొమురయ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ‘ మొబైల్‌ : 96522 75560

>
మరిన్ని వార్తలు