ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంగ్లాండ్ అండర్–19 క్రికెట్ బృందం మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంది. బృందంలోని 19 మంది క్రికెటర్లను ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, కేసరి నాగమణి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పాలక మండలి సభ్యులు, ఆలయ ఏఈవో చంద్రశేఖర్ క్రికెటర్లకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆ ప్రాంగణంలో కలియ తిరుగుతూ ఆలయ నిర్మాణం, విశిష్టతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజగోపురం ఎదుట ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఇంగ్లాండ్ క్రికెటర్లను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. విజయవాడ ఎలా ఉందంటూ పలువురు మహిళా భక్తులు వారిని అడగడంతో వారు పక్కనే ఉన్న బృందం పర్యవేక్షకుడిని అడిగి సమాధానం చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.