ఇంటింటికీ ఆరు.. కాంగ్రెస్‌ జోరు!

20 Sep, 2023 07:20 IST|Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం ఆరు గ్యారంటీ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. సోమవారం సీడబ్ల్యూసీ నేతలు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పక్కాగా ఆరు పథకాలను అమలు చేయనున్నామని చెప్పారు.

ఏకంగా పథకాల కార్డులు అందజేసి రసీదులను సైతం తీసుకున్నారు. డివిజన్లవారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రతి రోజు ఇంటింటీకి వెళ్లి ఆరు పథకాలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల గడువుకు మిగిలిన వంద రోజులను సద్వినియోగం చేసుకుంటే అధికారం తమదేనన్న భరోసా కల్పించారు.

నేతల ప్రచారం ఇలా..
ప్రచారంలో భాగంగా రాజస్తానన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ ఫైలట్‌ నాంపల్లిలోని యూసుఫియణ్‌ దర్గాలో ప్రార్థనలు, దేవీభాగ్‌లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారీఖ్‌ అన్వర్‌ అంబర్‌పేటలోని గోల్నాక డివిజనన్‌ నెహ్రూ నగర్‌, సుందర్‌నగర్‌, కృష్ణానగర్‌లలో పర్యటించారు. ముషీరాబాద్‌లో మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే ప్రణితి షిండే చిరు వ్యాపారులను కలిసి ఆరు పథకాలపై అవగాహన కల్పించారు.

ఆమె వెంట టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌లు ఉన్నారు. యాకుత్‌పురాలో నాగాలాండ్‌ పీసీసీ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ జమీర్‌, ఖైరతాబాద్‌లో మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్‌ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితో కలిసి ప్రజలకు ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. కూకట్‌పల్లిలో రాజ్యసభ మాజీ సభ్యుడు పీఎల్‌ పూనియా, మలక్‌పేటలో కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మాకెన్‌లు పర్యటించి ఆరు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు.

మరిన్ని వార్తలు