ఎన్‌ఆర్‌ఐ ఇల్లు కబ్జాకు యత్నం.. నటి స్వాతి దీక్షిత్‌పై కేసు

22 Nov, 2023 12:44 IST|Sakshi

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రూ. 30 కోట్ల విలువ చేసే ఖరీదైన ఎన్‌ఆర్‌ఐ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన నిందితులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 58లో అమెరికాలో నివసిస్తున్న అంతారం మాదురి అనే ఎన్‌ఆర్‌ఐకి 1100 గజాల్లో భవనం ఉంది. భవనంలోని మొదటి అంతస్తులో బంధువులు నివాసం ఉండగా గ్రౌండ్‌ఫ్లోర్‌ ఖాళీగా ఉంది. ఏడాది క్రితం ఈ భవనంలో కాఫీ షాప్‌ ఏర్పాటు చేస్తానంటూ మాధురిని సినీ నటి స్వాతి దీక్షిత్‌ సంప్రదించారు.

ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో లీజు రద్దు చేసుకున్నారు. ఈ విషయంపై న్యాయస్థానాల్లో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సుమారు 20 మంది దుండగులు దౌర్జన్యంగా గేటు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డుకున్న వాచ్‌మెన్‌ అశోక్‌ భార్య శోభారాణి మీద దాడి చేయడంతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసంచేశారు. ఈ మేరకు యజమాని మాధురికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకోగా దుండగుల్లో కొందరు పరారు కాగా ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు.

పట్టుబడ్డ వారిలో రణ్‌వీర్‌ సింఘ్‌, కండె రాంకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారంటూ స్వాతి దీక్షిత్‌, చింతల ప్రశాంత్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ వాచ్‌మెన్‌ శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నటి స్వాతి దీక్షిత్‌తో పాటు మరో మగ్గురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు