దక్షిణ ధ్రువంలో పోలార్‌ ప్రీత్‌ విజయ యాత్ర

2 Jan, 2024 05:39 IST|Sakshi

ఒంటరిగా అత్యంగా వేగంగా చేరుకున్న మహిళగా రికార్డు

లండన్‌: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్‌ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్‌ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్‌ కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్‌ షెల్ఫ్‌ నుంచి నవంబర్‌ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.

రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్‌ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు