2035 కల్లా చైనా చేతిలో... 1,500 అణు వార్‌హెడ్స్‌!

1 Dec, 2022 06:11 IST|Sakshi

వాషింగ్టన్‌: అణు పాటవంలో అమెరికాకు దీటుగా నిలవడమే లక్ష్యంగా చైనా 2035కల్లా ఏకంగా 1,500 అణు వార్‌హెడ్లను సమకూర్చుకోనుందని పెంటగాన్‌ అంచనా వేసింది. ప్రస్తుతం చైనా వద్ద 400కు పైగా అణు వార్‌హెడ్లున్నాయని అభిప్రాయపడింది. అంతేగాక వచ్చే పదేళ్లలో అణ్వస్త్ర బలగాలను ఆధునీకరించి, విస్తృతం చేసుకోవడంపై డ్రాగన్‌ కంట్రీ దృష్టి పెట్టిందని అమెరికా కాంగ్రెస్‌కు తాజాగా సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది. ‘‘ఇందుకోసం ఫ్లుటోనియం ఉత్పత్తిని విపరీతంగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లను భారీగా నిర్మించుకుంటోంది. భూ, సముద్ర, గగనతల అణ్వస్త్ర ప్రయోగ వేదికలను వీలైనంతగా పెంచుకోవడంపై విపరీతంగా నిధులు వెచ్చిస్తోంది. 2035కల్లా సైనిక పాటవాన్ని పూర్తిగా ఆధునీకరించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దేశీయ, విదేశాంగ విధానాల ద్వారా ప్రపంచ వేదికపై తన బలాన్ని మరింతగా పెంచుకోవడమే చైనా లక్ష్యం. ఇండో పసిఫిక్‌ సముద్ర జలాల్లో చైనా దూకుడు వెనక కారణమిదే’’ అని వివరించింది. పెంటగాన్‌ నివేదికను చైనా కొట్టిపారేసింది.
 

మరిన్ని వార్తలు