స్టెయిన్‌తో యూరప్‌ బెంబేలు, మరణాలూ ఎక్కువే!

25 Jan, 2021 02:02 IST|Sakshi

డెన్మార్క్‌ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనంలో వెల్లడి

కోపెన్‌హాగెన్‌: బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ యూరప్‌ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్‌ కేసులు వ్యాప్తి చెందుతున్నట్టుగా డెన్మార్క్‌ ప్రభుత్వ సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది. డెన్మార్క్‌లో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ఒకే వారంలో కేసుల సంఖ్య ఏకంగా 70శాతం ఎగబాకింది.  ఈ వైరస్‌ జన్యుక్రమాన్ని త్వరితగతిన మార్చుకుంటూ ఉండడంతో పాజిటివ్‌ కేసులు నమోదైన వారిలో ఏ రకమైన వైరస్‌ సోకిందో విశ్లేషించాల్సి ఉంటుందని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ సైంటిఫిక్‌ డైరెక్టర్‌ ట్యారా గ్రోవ్‌ క్రాజ్‌ అన్నారు.

టీకా తీసుకున్నా జాగ్రత్తలు తప్పదు
కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న వెంటనే రోగ నిరోధక శక్తి రాదని, అందుకే ప్రజలం దరూ కచ్చితంగా లాక్‌డౌన్‌ నిబంధనల్ని పా టించాలని ఇంగ్లాండ్‌ డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ జొనాథన్‌ వాన్‌–టామ్‌ అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న మూడు వారాల తర్వాతే అది పని చేయడం మొదలవుతుందని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి  ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుకే ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.  ‘‘వ్యాక్సిన్‌ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రజలందరూ కచ్చితంగా నిబంధనల్ని పాటించాలి. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సలహాల్ని స్వీకరించాలి.

మరణాలు అధికం..
కొత్త స్ట్రెయిన్‌ వల్ల మరణా లు అధికంగా సంభవిస్తున్నా యని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించింది. యూకే ఆరోగ్య సంస్థలతో కూడా సీడీసీ మాట్లాడింది. సాధారణ కరోనా వైరస్‌ సోకిన ప్రతీ వెయ్యి మందిలో 10 మంది ప్రాణాలు కోల్పోతే ఈ కొత్త స్ట్రెయిన్‌తో సగటున వెయ్యి కేసుల్లో 14 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.  బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ కూడా ఈ వైరస్‌తో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అంతేగాక గత వారం రోజుల్లో బ్రిటన్‌లో మృతుల సంఖ్య ఏకంగా 16 శాతం పెరిగింది.

మరిన్ని వార్తలు