మొరాయించిన గూగుల్‌ సేవలు

15 Dec, 2020 05:30 IST|Sakshi

న్యూఢిల్లీ:  జీమెయిల్‌తో సహా ఇతర గూగుల్‌ సేవల్లో సోమవారం సాయంత్రం 5.17 గంటలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్‌ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్‌ వంటి వాటిలోకి లాగిన్‌ అయినవారికి స్క్రీన్‌పై టెంపరరీ ఎర్రర్‌ అంటూ మెసేజ్‌ దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. దాదాపు 45 నిమిషాలపాటు గూగుల్‌ సేవలు నిలిచిపోయాయి. ‘ఇంటర్నల్‌ స్టోరేజీ కోటా’లో సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు గూగుల్‌ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. సాయంత్రం 6.02 గంటలకల్లా సేవలను పునరుద్ధరించగలిగామని తెలిపారు. అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఇబ్బంది పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌ సేవలు నిలిచిపోవడం పట్ల సోషల్‌ మీడియాలో సెటైర్లు పడ్డాయి. జీమెయిల్‌ డౌన్, యూట్యూబ్‌ డౌన్‌ అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మరికొందరు ‘ఇది యుగాంతం’ అంటూ సరదాగా కామెంట్లు చేయడం విశేషం.

>
మరిన్ని వార్తలు