Guntur Kaaram Movie: మహేశ్ మూవీపై నిర్మాత నాగవంశీది నమ్మకమా? లేదంటే..?

15 Dec, 2023 17:25 IST|Sakshi

సోషల్ మీడియా దెబ్బకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పటికే తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే తీస్తున్న సినిమా విషయంలో అన్నీ బాగుంటే పర్లేదు. అలా కాకుండా టీజర్, పాటల్లాంటివి ఏ మాత్రం తేడా కొట్టినా సరే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. అభిమాన హీరో మూవీ అయినా గానీ చీల్చిచెండాడేస్తున్నారు. తాజాగా 'గుంటూరు కారం'పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిర్మాత నాగవంశీ ఎంటర్ కావడంతో ఈ గొడవ మరింత పెద్దదైపోయింది!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న సినిమా 'గుంటూరు కారం'. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రాబోయే జనవరి 12న థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివర దశలో ఉంది. మరోవైపు ఒక్కో అప్డేట్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'దమ్ మసాలా' అని తొలి పాట రిలీజ్ చేయగా అభిమానుల్ని ఆకట్టుకుంది. తాజాగా 'ఓ బేబీ' పేరుతో ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ)

త్రివిక్రమ్-తమన్ కాంబోకి తోడు మహేశ్ హీరో అయ్యేసరికి.. ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఊహించుకున్నారు. పాట ఆ స్థాయిని రీచ్ కాలేదు. దీంతో మహేశ్ అభిమానులే స్వయంగా ట్రోలింగ్‌కి దిగారు. అయితే ఈ విమర్శలు ఫరిది దాటిపోయసరికి 'గుంటూరు కారం' నిర్మాత నాగవంశీ సైలెంట్‌గా ఉండలేకపోయారు. 'యానిమల్' సినిమాలోని ఓ సీన్‌కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి ట్రోలర్స్‌ని మరింత రెచ్చగొట్టారు.

ఈ ట్వీట్ దెబ్బకు గొడవ మరింత ముదిరిపోయేసరికి.. నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చుకున్నారు. పాటపై ఫీడ్ బ్యాక్ ఇస్తే పర్లేదు గానీ మరి వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నారని అదే బాధ కలిగించిందని అర్థమొచ్చేలా వివరిస్తూ మరో ట్వీట్ చేశారు. అలానే జనవరి 12న చూసుకుందాం అన్నట్లు ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు. మరి 'గుంటూరు కారం'పై నిర్మాత నాగవంశీది నమ్మకమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మూవీ వస్తే తెలుస్తోంది. కానీ అప్పటివరకు ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)

>
మరిన్ని వార్తలు