టైటానిక్‌ సబ్‌మెరైన్‌ విషాదం: యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ కీలక ప్రకటన

11 Oct, 2023 15:55 IST|Sakshi

చివరి అవశేషాలు దొరికాయ్‌: యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ 

విచారణ కొనసాగుతుంది

టైటానిక్ సబ్‌మెరైన్‌కు విషాదానికి సంబంధించిన అన్వేషణలోయూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చేసుకున్నామని  కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్ సబ్‌మెర్సిబుల్ నుండి మానవ అవశేషాలు భావిస్తున్నవాటితోపాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం పంపింది. గత వారం వాటిని స్వాధీనం చేసుకుని కోస్ట్ గార్డ్ అధికారులు  యుఎస్ ఓడరేవుకు తరలించినట్లు బీబీసీ రిపోర్ట్‌ చేసింది. 

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల అన్వేషణకు వెళ్లి మార్గమధ్యలో సబ్‌మెరైన్‌ పేలిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే కొన్నింటిని సేకరించగా మిగిలిన శిధిలాల చివరి భాగాలను యూఎస్‌ కోస్ట్ గార్డ్ తాజాగా గుర్తించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఓషన్ ఆపరేటర్ అయిన Ocean Gate అప్పటినుండి వ్యాపారాన్ని నిలిపివేసింది.

ఈ ఏడాది జూన్ 18న ఉత్తర అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన పేలుడులో మరణించిన వారిలో సబ్‌మెర్సిబుల్ పైలట్, కంపెనీ  సీఈవో స్టాక్‌టన్ రష్ కూడా ఉన్నారు. మిగిలిన నలుగురు ప్రయాణికుల్లో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, పాల్-హెన్రీ నార్గోలెట్, మాజీ ఫ్రెంచ్ నౌకాదళ డైవర్ ఉన్నారు.ఈ విషాదంపై ప్రపంచ వ్యాప్త విచారణ కొనసాగుతోంది.

కాగా 1912లో టైటినిక్‌ షిప్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణనౌకగా పేరు గాంచింది. అయితే ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన తొలి ప్రయాణంలోనే 1912  ఏప్రిల్ 14న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 1517 మంది మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ  విషాదంపై 1997లో ప్రఖ్యాత హాలీవుడ్  దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్‌ తీసిన‘ టైటానిక్’   సినిమా  భారీ హిట్ అందుకుంది.

మరిన్ని వార్తలు