తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!

24 Sep, 2023 05:08 IST|Sakshi

మిషిగన్‌: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్‌ టెర్రయిన్‌ వెహికల్‌(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు.

అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్‌ హార్న్‌కు చెందిన థియా చేజ్‌ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు.

ఆల్‌ టెర్రయిన్‌ వెహికిల్‌(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

మరిన్ని వార్తలు