అమ్మ మృతదేహంతో ఆరు నెలలు.. ఎందుకు అలా చేశాడంటే..?

6 Jun, 2023 08:40 IST|Sakshi

ఒక వ్యక్తి గడచిన ఆరు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఉంటున్నాడు. ఇరుగుపొరుగువారికి తన తల్లి విదేశాల్లో ఉంటున్నదని ఇన్నాళ్లూ అబద్ధం చెబుతూ వచ్చాడు. అయితే అతని వ్యవహారం ఎట్టకేలకు పోలీసుల చొరవతో బహిర్గతమయ్యింది. ఆ వ్యక్తి గత ఆరేళ్లుగా తల్లి మృతదేహాన్ని ఎందుకు అలానే ఉంచాడో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పెన్షన్‌ అందుకునేందుకే తాను తన తల్లి మృతదేహాన్ని ఉంచానని తెలిపాడు. అతను తన తల్లి రిటైర్మెంట్‌ ఫండ్‌ సొమ్మును ప్రతినెలా అందుకుంటున్నాడు.

నిందితుని వయసు 60 ఏళ్లు. అతని పేరు వెల్లడికాలేదు. డైలీ స్టార్‌ తెలిపిన వివరాల ప్రకారం నిందితుని తల్లి పేరు హెల్గా మారియా హ్యాంబర్త్‌. ఈ ఉదంతం ఇటలీలో చోటుచేసుకుంది. అతను తన ఇరుగుపొరుగువారితో  తన తల్లి హెల్గా తమ దేశమైన జర్మనీకి తిరిగి వెళ్లిపోయిందని చెబుతూ వస్తున్నాడు.  తల్లి మృతదేహంతో పాటు ఉంటూ నిందితుడు ఇప్పటివరకూ 156,000 పౌండ్లు (సుమారు రూ. 1.59 కోట్లు) అందుకున్నాడు. పోలీసులు ఇటీవలే ఇతని గుట్టును రట్టు చేశారు.  

మే 25న పోలీసులు ఎమర్జెన్సీ సర్వీస్‌ కోసం అతను ఉంటున్న బిల్డింగ్‌లోకి ప్రవేశించారు.  ఆ సమయంలో నిందితుడు తన తల్లి హెల్గా మృతదేహాన్ని ఒక బ్యాగులో దాచి, బెడ్‌పైన ఉంచాడు.  అతను ఇంటిలో లేడు. హెల్గా కరోనా వైరస్‌కు సంబంధించి తన హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కార్డు కోసం అప్పటివరకూ దరఖాస్తు చేయలేదు. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆమెను సంప్రదించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానంతో ఇంటిలో తనిఖీలు చేశారు. అప్పుడు వారికి హెల్గా మృతదేహం లభ్యమయ్యింది. వెంటనే వారు హెల్గా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  మరణించిన తల్లి పెన్షన్‌ను నిందితుడు ఎలా తీసుకుంటున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

చదవండి: బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే..

మరిన్ని వార్తలు