ఇమ్రాన్‌కు ఈసీ షాక్‌.. పార్టీ చీఫ్‌ పదవి తొలగింపు!

6 Dec, 2022 15:23 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌ తెహ్రిక్‌ ఈ ఇన్సాఫ్‌ పార‍్టీ (పీటీఐ) చీఫ్‌ పదవి నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఆ దేశ ఎన్నికల సంఘం. తోషాఖానా(ఖజానా) కేసుకు సంబంధించి ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలుపుతూ ఇమ్రాన్‌కు నోటీసులు సైతం జారీ చేసిందని డౌన్‌ న్యూస్‌పేపర్‌ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్‌ 13న చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను దేశ ఖజానా తోషాఖానా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని ఎక్కువ ధరకు విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో తప్పుడు సమాచారం, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారన్న ఆరోపణలతో ఆర్టికల్‌ 63(i) ప్రకారం ఆయనను అనర్హుడిగా గుర్తించింది ఎన్నికల సంఘం. ఈసీ రికార్డ్స్‌ ప్రకారం.. తోషాఖానా నుంచి బహుమతులను రూ.21.5 మిలియన్లకు కొనుగోలు చేసి రూ.108 మిలియన్లకు విక్రయించినట్లు తేలింది. 

తోషాఖానా బహుమతుల విక్రయంపై వార్తలు వచ్చిన క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్‌ చట్టాల ప్రకారం విదేశాల్లో బహుమతిగా లభించిన వాటిని తోషాఖానా(ఖజానా) విభాగంలో వాటి విలువను లెక్కించాలి. ఆ తర్వాతే వాటిని 50 శాతం డిస్కౌంట్‌తో తీసుకునేందుకు వీలుంటుంది.

ఇదీ చదవండి: భారీ వర్షాలతో బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి

మరిన్ని వార్తలు