ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

12 Nov, 2023 17:04 IST|Sakshi

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ను నిందించారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని అన్నారు. 
 
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని ట్రూడో ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని అమెరికా, మిత్రదేశాలను కోరారు. రూల్ ఆఫ్‌ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించారు. ఈ వివాదం ఇరుదేశాల మధ్య అగ్గి రాజేసింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.

ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వేదికలపై ట్రూడో ఇప్పటికే పలుమార్లు  ప్రస్తావించారు. బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్‌ను నిందించారు. దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. 

ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

మరిన్ని వార్తలు