యశవంతపుర: టెక్నాలజీ అనేది ఎప్పుడో విడిపోయిన వారిని కలుపుతుంది, అలాగే కలిసి ఉన్నవారిని విడిపోయేలా కూడా చేస్తుంది. కారులో అమర్చిన జీపీఎస్ ద్వారా భార్యపై నిఘా పెట్టి బండారాన్ని బయటపెట్టాడో భర్త. ఈ ఘటన ఐటీ సిటీ మహాలక్ష్మీ లేఔట్ పరిధిలో జరిగింది.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిఖిల్ అంగడి– ప్రియాంక దంపతులు. నిఖిల్ ఐటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. వీరికి 9 ఏళ్ల కిందట పెళ్లి కాగా, ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. మూడేళ్ల కిందట నిఖిల్ హుండై ఐ–20 కారును కొని దానికి జీపీఎస్ను అమర్చాడు. కారు ఎక్కడికి వెళ్లినా తన మొబైల్కు సమాచారం వచ్చేలా సెట్ చేశాడు. ఇటీవల నిఖిల్ కారును ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లాడు.
హత్య చేస్తానని బెదిరింపులు
భార్య ప్రియాంక కారును తీసుకొని బయటకు వెళ్లింది. బీఈఎల్ సర్కిల్ వద్దనున్న లాడ్జి ఆవరణలో కారు ఆగింది. తెల్లవారుజామున ఐదు గంటల వరకు అక్కడే కారు ఉండింది. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జరిగింది. జీపీఎస్ ద్వారా గమనిస్తున్న నిఖిల్ మరుసటి రోజు అనుమానంతో హోటల్కు వెళ్లి విచారించాడు. అక్కడ ప్రియాంక, ప్రియుడు ఓటర్ ఐడి కార్డులతో ఒకే రూం తీసుకున్నట్లు తెలిపింది. ఇదేమిటని భార్యను ప్రశ్నించగా ప్రియుడు అశోక్ గుత్తేదార్ వచ్చి హత్య చేస్తానంటూ నిఖిల్ని బెదిరించాడు. ఈనేపథ్యంలో భార్య, ప్రియుని నుంచి తనను రక్షించాలని నిఖిల్ శనివారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.