కంప్లి: హంపీ భువనేశ్వరి దేవి విగ్రహం ఒక వైపు, రాతిరథం మరో వైపు మధ్యభాగంలో వీరగాసె, డొళ్లు కుణిత తదితర కళా బృందాలతో కూడిన స్తబ్దచిత్ర కర్ణాటక సంభ్రమ–50వ జ్యోతిరథయాత్రకు ఎమ్మెల్యే జేఎన్ గణేష్, తహసీల్దార్ శివరాజ్ ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి కర్ణాటక అని పేరు పెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవున వైవిధ్యంతో కూడిన నాడహబ్బ సంబరాలను నిర్వహించాలని తీర్మానించిన సంగతి తెలిసిందే.
బెళగావి సమావేశాల కోసం సీసీ కెమెరాలు
రాయచూరు రూరల్: డిసెంబర్ 4 నుంచి బెళగావిలోని సువర్ణసౌధలో జరగనున్న శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిఘా పటిష్టతకు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆయన సోమవారం బెళగావిలోని పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని అన్ని కూడళ్లలో ప్రధాన ద్వారాల వద్ద ప్రత్యేక నిఘా సిబ్బందిని నియమించాలని పోలీస్ అధికారులకు సూచించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. మత చాందస ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సిద్దరామప్ప, డీసీపీ రేహాన్ జగదీష్, ఎస్పీ భీమాశంకర్ గుళేద్, రవీంద్ర, స్నేహలున్నారు.