రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!

12 Sep, 2023 09:03 IST|Sakshi

కంకర లారీలతో కౌటాల రోడ్డుపై ఏర్పడిన గుంతలు!

అధిక లోడుతో క్వారీ, క్రషర్‌ల లారీల రాకపోకలు..

దెబ్బతింటున్న రహదారులతో ప్రజలకు నరకం!

పంటల దిగుబడిపైనా కంకర దుమ్ము ప్రభావం..

దృష్టి సారించని అధికారులు, క్వారీల యాజమాన్యం!

కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్‌, విద్యుత్‌ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గుంతలతో తిప్పలు..
కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్‌నగర్‌, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్‌(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్‌తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

నిత్యం నరకం..
దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్‌, పార్డి, మం.కౌటాల

► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్‌నగర్‌ మార్గంలో డబుల్‌ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

 

► కౌటాల మండలం పార్డీ, సాండ్‌గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్‌గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్‌ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం.

మరమ్మతులు చేయిస్తాం..
అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్‌అండ్‌బీ డీఈ, కాగజ్‌నగర్‌

పంటలకు తీవ్ర నష్టం..
కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్‌గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు.

పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్‌లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్‌లోడ్‌తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు