కృష్ణా: మండలంలోని లక్ష్మీపురం నెహ్రూనగర్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిగురుపల్లి వాసు కుమారుడు చిగురుపల్లి వినయ్ (23) గొంతు తెగిపోయి విగతజీవిగా పడి ఉన్నాడు. బంధువులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పక్క వీధిలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని బయటకు వెళ్లిన వినయ్ అమ్మమ్మ ఇంట్లో కొద్దిసేపు ఉండి వెళ్లిపోయాడు.
మంగళవారం ఉదయం వినయ్ లక్ష్మీపురం– పుచ్చగడ్డ డొంక రోడ్డులో వినయ్ పీక తెగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వెంటనే వినయ్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి వినయ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ డీఎస్పీ పి.మురళీధర్, సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ఎస్ఐ సీహెచ్ చినబాబు లక్ష్మీపురం చేరుకుని వినయ్ మృతదేహాన్ని పరిశీలించారు.
మిస్టరీగా వినయ్ మరణం
వినయ్ది హత్యా? ఆత్మహత్యా? అనేది మిస్టరీగా మారింది. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. గొంతు బాగా తెగిపోయి ఉండటంతో హత్యగా భావించాలా? లేక వినయ్ కుడి చేతి వేళ్లపై బ్లేడుతో తెగిన గాయాలు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అని పోలీసులు ఈ రెండు కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. వినయ్కు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వినయ్ మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. కేసు మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు.
తెల్లవారితే పుట్టినరోజు...
తెల్లవారితే పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిగురుపల్లి వినయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కుటుంబ సభ్యులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి పుట్టినరోజు జరుపుకుందామని స్నేహితులు రమ్మని పిలిచినా రానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వినయ్ ఈ విధంగా మృతి చెందటం గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ...
రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసిన వినయ్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. బ్యాంక్ కోచింగ్ కూడా పూర్తి చేశాడు. ఉపాధి కోసం గత నాలుగు నెలలుగా భవనాలకు టైల్స్ అంటించే పనికి వెళుతున్నాడు. జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న వినయ్ ఇలా అర్థాంతరంగా అసువులు బాయటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.