పేకాడుతూ దొరికిన టీడీపీ మండల అధ్యక్షుడు

11 Nov, 2023 11:40 IST|Sakshi
చంద్రబాబుతో బండే శ్రీను ( ఫైల్‌)

ఏ1 నిందితుడిగా బండే శ్రీను

సాక్షిప్రతినిధి విజయవాడ: కృష్ణా జిల్లా కోడూరు మండలం మందపాకల శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై జరిగిన మెరుపు దాడిలో టీడీపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి శ్రీనివాసరావు (బండే శ్రీను) అడ్డంగా దొరికిపోవడం దివిసీమలో తీవ్ర చర్చనీయాంశమైంది. పైకి పెద్ద మనిషిలా నీతులు చెప్పే బండే శ్రీను చట్ట వ్యతిరేకమైన జూదంలో దొరకడం పట్ల ఆ పార్టీ నాయకులే చీదరించుకుంటున్నారు.

జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్‌ పర్యవేక్షణలో సీఐ ఎల్‌. రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ మరికొంతమంది సిబ్బందితో రత్నకోడు మురుగుకాలువ గట్టుపై ఉన్న పూరిగుడిసెలో పేకాట శిబిరంపై దాడిచేసి ఏడుగురు జూదరులను పట్టుకోవడంతో పాటు వారి నుంచి రూ.61,800 నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఏ1 నిందితుడిగా దొరికిన బండే శ్రీను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు ముఖ్య అనుచరుడు కావడం విశేషం. ఆయనతో పాటు జూదమాడుతూ దొరికిన మరో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, బండే అనుచరులే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు