బోనాల పండుగకు వస్తుండగా.. తీవ్ర విషాదం!

11 Sep, 2023 09:47 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం!

మహిళకు తీవ్ర గాయాలు..

సంగెంలో ఘటన..!

వరంగల్‌: బోనాల పండుగకు వస్తుండగా స్కూటీ అదుపు తప్పి కిందపడడంతో ఓ యువకుడు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన పులి రవీందర్‌(30) హనుమకొండ కోర్టులో జ్యుడీషియల్‌ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తూ తన చిన్నమ్మ చిర్ర పద్మ ఇంట్లో ఉంటున్నాడు. స్వగ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండగ ఉండడంతో తన స్కూటీపై చిన్నమ్మ పద్మను తీసుకుని వస్తున్నాడు.

ఈ క్రమంలో చింతలపల్లి రైల్వేగేట్‌ వద్దకు రాగానే స్కూటీ అదుపు తప్పడంతో ఇద్దరు కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలలైన క్షతగాత్రులను వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా రవీందర్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పద్మ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.భరత్‌ తెలిపారు.

రవీందర్‌కు జిల్లా జడ్జి కృష్ణమూర్తి నివాళి..
హనుమకొండ జిల్లా కోర్టులో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్న పులి రవీందర్‌ ఆదివారం సంగెం మండల కేంద్రంలోని చింతలపల్లి రైల్వే గేట్‌ వద్ద స్కూటీపై నుంచి పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి కృష్ణమూర్తి సతీసమేతంగా వరంగల్‌ ఎంజీఎం మార్చురీలో రవీందర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో వరంగల్‌, హనుమకొండ జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు బుజ్జి బాబు, మల్లికార్జున్‌, కోర్టు సిబ్బంది, సర్పంచ్‌ల ఫోరం సంగెం మండల అధ్యక్షుడు డేటి బాబు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు