తాగిన మత్తులో.. మొగుడే యముడైనాడు..!

26 Oct, 2023 11:09 IST|Sakshi

మహబూబ్‌నగర్‌: తాగిన మైకంలో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్దుడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని తల్పునూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. తల్పునూర్‌కు చెందిన రాంపేట రాములు, నాగమణి (40) భార్యాభర్తలు. వీరిద్దరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుని బతికేవారు. దసరా పండుగ నిమిత్తం వారంరోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు.

వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉండగా.. పెద్దకూతురు స్వప్నకు పెళ్లయింది. మరో కూతురు హైదరాబాద్‌లో చదువుకుంటోంది. కుమారుడు సైతం హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. బుధవారం తాగిన మైకంలో నాగమణితో భర్త రాములు గొడవ పడ్డారు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ.. సాయంత్రం వరకు అతడు ఇంటి తలుపులను తెరవలేదు.

సాయంత్రం 6గంటల ప్రాంతంలో వారి మొదటి కూతురు స్వప్న పిల్లలతో కలిసి ఇంటికి రాగా, చాలాసేపటి తర్వాత తండ్రి తలుపులు తెరిచాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూస్తే తల్లి రక్తపు మడుగులో కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, అప్పటికే ఆమె మరణించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు