ముప్పై కోట్లతో సెట్‌ 

11 Nov, 2020 00:39 IST|Sakshi

‘సాహో’ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నటుడు కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఇటీవల ఇటలీలో కీలక సన్నివేశాలు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చిన ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందం త్వరలోనే హైదరాబాద్‌ షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది.

ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేస్తున్నట్లు సమాచారం. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తుండటం విశేషం. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. నిజానికి యాక్షన్‌ పార్ట్‌ కన్నా ప్రేమకథ ఎక్కువ ఉంటుందని ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్‌ పేర్కొన్నారు. అయితే ఉన్న తక్కువ యాక్షన్‌ కూడా భారీ స్థాయిలో ఉంటుందట. మరి.. క్లైమాక్స్‌కే 30 కోట్లతో సెట్‌ వేస్తున్నారంటే యాక్షన్‌ పార్ట్‌ భారీగా ఉంటుందని ఊహించుకోవచ్చు.  

మరిన్ని వార్తలు