Banjara Hills Police: కారు ఎవరిది..? డాక్యుమెంట్లు ఎవరి పేరున ఉన్నాయి..?

7 Mar, 2024 06:46 IST|Sakshi

నటిని ప్రశ్నించిన బంజారాహిల్స్‌ పోలీసులు 

హైదరాబాద్: ట్రాఫిక్‌  హోంగార్డుపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా దుర్భాషలాడిన సినీనటి సౌమ్యాజాను అలియాస్‌ షేక్‌ జాన్‌బీని బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. గత నెల 24న రాత్రి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–12లోని అగ్రసేన్‌ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ హోంగార్డు గొడుగు విఘ్నేష్‌  కారులో ఓ యువతి రాంగ్‌రూట్‌లో వస్తుండగా అడ్డుకున్నాడు. . దీంతో రెచ్చిపోయిన ఆమె హోంగార్డు విఘ్నేష్‌  పై దాడి చేయడమేగాక దుస్తులు చించేసి అడ్డువచి్చన పోలీసులను కూడా దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించింది.

 విధుల్లో ఉన్న పోలీసులను ఆటంకం కలిగిస్తూ నోటికొచి్చనట్లు తిట్టడంతో పాటు న్యూసెన్స్‌కు కూడా పాల్పడింది. అదే రోజు రాత్రి హోంగార్డు విఘ్నేష్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతిని సినీనటి సౌమ్యాజాను అలియాస్‌ షేక్‌జాన్‌బీగా గుర్తించి ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్న ఆమె ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి అడ్రస్‌ తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లి విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆమె తరపు న్యాయవాదులు పోలీసులకు చూపించారు. అప్పటికప్పుడు ఆమెకు 41ఏ నోటీసు ఇచ్చి రెండు గంటల పాటు విచారించారు. 

ఆ రోజు నడిపిన జాగ్వార్‌ కారు ఎవరిది, కారుకు సంబంధించిన డాక్యుమెంట్లను మూడు రోజుల్లో చూపించాలన్నారు. అలాగే మెడిసిన్‌ కోసం వెళుతున్నట్లుగా ఆమె చెప్పిందని, మెడిసిన్‌ ప్రిస్కప్షన్‌ కూడా చూపించాలని  ఆదేశించారు. ఆ రోజు రాంగ్‌రూట్‌లో వెళ్లడానికి గల కారణం, పోలీసులపై ఎందుకు దుర్భాషలాడారు, హోంగార్డును ఎందుకు అడ్డుకున్నారు అన్న విషయాలపై ఆమెను ప్రశి్నంచారు. మొత్తం ఎనిమిది ప్రశ్నలు సంధించిన పోలీసులు వాటికి జవాబు ఇవ్వాలని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసులో సూచించారు. మూడు రోజుల్లో మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు రావాలని, విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను ఆదేశించారు. 

నేను ఎవరిపైనా దాడి చేయలేదు 
అనంతరం సౌమ్యాజాను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపింది. ఆరోజు తాను నడిపిన జాగ్వార్‌ కారు తన స్నేహితులదని, తాను రాంగ్‌ రూట్‌లో వెళ్లిన మాట వాస్తవవేనని, తనది పొరపాటేనని తెలిపింది. తనపై మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, త్వరలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు