ఒక్క సినిమా కోసం ఇద్దరు వారసులు కలిస్తే..?

7 Mar, 2024 06:20 IST|Sakshi

ఇద్దరు ప్రముఖుల వారసులు కలిసి చిత్రం చేయడం అనేది అరుదైన విషయమే అవుతుంది. ఇప్పుడు అదే జరగబోతోందా..? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వినిపిస్తోంది. విక్రమ్‌ వారసుడు ధ్రువ్‌ విక్రమ్‌ గురించి తెలిసిందే. తెలుగు చిత్రం అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ద్వారా కోలీవుడ్‌లో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆదిత్య వర్మ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి ధ్రువ్‌ విక్రమ్‌ నటించిన మహాన్‌ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టినా, అది ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్‌ విక్రమ్‌ మంచి థియేటరికల్‌ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

తాజాగా మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో చిత్రంలో నటించే విషయమై వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రముఖ నటుడు విజయ్‌ వారసుడు జాసన్‌ సంజయ్‌ కూడా సినీ రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. లండన్‌లో సినిమా గురించి చదివి వచ్చిన ఈయనకు హీరోగా పలు అవకాశాలు వచ్చినా, వాటిని కాదని దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అలా కథను రెడీ చేసుకున్న జాసన్‌ సంజయ్‌కు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ అవకాశం కల్పించింది.

ఈ సంస్థలో ఈయన దర్శకత్వం వహించనున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది నెలల క్రితమే జరిగాయి. అప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో నటించే హీరోల ఎంపిక చాలా కాలంగా జరుగుతోంది. ఈ వరుసలో నటుడు విజయ్‌సేతుపతి, కవిన్‌ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరిగా నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ను ఇందులో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన చర్చ తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

whatsapp channel

మరిన్ని వార్తలు