Ajith Kumar: డైరెక్టర్‌కు ఆ కండిషన్‌ పెట్టిన అజిత్‌

25 Feb, 2023 09:09 IST|Sakshi

నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన చిత్రం నుంచి తొలగించారు. ఆయన కథను పూర్తిగా సిద్ధం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కాగా ఇప్పుడు ఆయన స్థానంలోకి దర్శకుడు మగిళ్‌ తిరుమేణి వచ్చారు. నిజం చెప్పాలంటే ఈయన పేరును కూడా చిత్ర వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

కాగా అజిత్‌ నటించే నూతన చిత్రం షూటింగును మార్చి మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో అజిత్‌ జంటగా నటించే నటి ఎవరనేది కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో ప్రతి నాయకుడిగా అరుణ్‌ విజయ్, ముఖ్యపాత్రల్లో అధర్వ, బిగ్‌ బాస్‌ కవిన్, జాన్‌ కెక్కెన్‌ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని, నీరవ్‌ షా చాయాగ్రహణం అందించనున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లో పూర్తిచేయాలని దర్శకుడికి అజిత్‌ నిబంధన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

రెండు లేదా మూడు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి డెవిల్‌ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తుణివు చిత్రంలో అజిత్‌ పాత్ర పేరు బ్లాక్‌ డెవిల్‌. దీంతో అందులోని డెవిల్‌ పేరును తన 62వ చిత్రానికి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అజిత్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు