ఆఫీసు జలమయం, సిబ్బందికి తన దుస్తులిచ్చిన బిగ్‌బీ

18 May, 2021 12:12 IST|Sakshi

ముంబై: తౌక్టే తుపాను భీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆఫీసు జలమయమైంది. సిబ్బంది కూడా ఈ వర్షంలో తడిసి ముద్దవడంతో వారికి అమితాబ్‌ తన వార్డ్‌రోబ్‌లోని దుస్తులను తీసిచ్చాడు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు. 'తుపాను మధ్యలో అంతా నిశ్శబ్ధంగా ఉంది. వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. చెట్లు పడిపోయాయి. వరద నీరు ముంబైలోని నా ఆఫీసును ముంచెత్తింది. దాని మీద కప్పిన ప్లాస్టిక్‌ కవర్‌ షీట్లు వేగంగా వీస్తున్న గాలుల వల్ల కొట్టుకుపోయాయి. షెడ్డు కూడా పాక్షికంగా ధ్వంసం అయింది. సిబ్బంది కూడా తడిచిపోయారు. అయినప్పటికీ వారు మరమ్మత్తులు చేస్తూనే ఉన్నారు. దీంతో వారికి నా వార్డ్‌రోబ్‌ నుంచి చెల్సియా ఫుట్‌బాల్‌ క్లబ్‌ , పింక్‌ పాంథర్స్‌ కబడ్డీ టీమ్‌..  టీ షర్ట్స్‌ తీసిచ్చాను' అని రాసుకొచ్చాడు.

కాగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించినున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌పడతి 13'వ సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర', ఇమ్రాన్‌ హష్మీ, రియా చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటించిన 'చెహర్‌' చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు అజయ్‌ దేవ్‌గన్‌ దర్శకత్వం వహిస్తున్న 'మే డే'లోనూ నటిస్తున్నాడు. 'ఆంఖెన్‌ 2', 'ఝండ్‌' సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.

చదవండి: వైరల్‌: పాక్‌ పీఎం, బాలీవుడ్‌ హీరోయిన్‌ లవ్‌ స్టోరి

మరిన్ని వార్తలు