-

Ranbir Kapoor: జీవితాంతం ఆ బాధ ఉంటుంది.. నా కూతురి కోసం సినిమాలు మానేద్దామనుకున్నా

28 Nov, 2023 00:47 IST|Sakshi
‘యానిమల్‌’ ప్రెస్‌మీట్‌లో ఓ దృశ్యం 

రణ్‌బీర్‌ కపూర్‌

‘‘కొన్నేళ్ల క్రితం మా నాన్నను(రిషీ కపూర్‌) కోల్పోయా. నా చిన్నప్పుడు నాన్న షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో సరైన సమయాన్ని గడపలేకపోయాను. నాన్నపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. కానీ, మా మధ్య స్నేహబంధం లేదు. ఆయనతో ఫ్రెండ్లీగా ఉండి మరెన్నో విషయాలు పంచుకుని ఉంటే బాగుండేదనే బాధ నాకు ఉంది. నా జీవితాంతం ఆ బాధ ఉంటుంది’’ అని హీరో రణ్‌బీర్‌ కపూర్‌ అన్నారు.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’. తండ్రీకొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ–‘‘తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో అభిమానం. ఇక్కడ వాళ్లు చూపించే ప్రేమాభిమానం మరో స్థాయిలో ఉంటాయి. సినిమాలు మానేసి నా కుమార్తె రాహ కోసం నా సమయాన్ని కేటాయించాలని ఉంది. కాకపోతే నేనూ నా కలలను సాకారం చేసుకోవాలి కాబట్టి అలా చేయలేను 

(నవ్వుతూ)’’ అన్నారు. సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘మహేశ్‌బాబుకు ‘యానిమల్‌’ కథ చెప్పలేదు. ‘డెవిల్‌’ కథ చెప్పాను. కానీ మా కాంబో కుదరలేదు’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్రాలకు మన దగ్గర టికెట్‌ రేట్స్‌ ఎలా ఉంటాయో ‘యానిమల్‌’కి అలానే ఉంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్‌ ఓపెన్‌ చేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ‘అర్జున్‌ రెడ్డి’ని మిస్‌ అయ్యాను.

అప్పటి నుంచి సందీప్‌ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను. భూషణ్‌గారు నన్ను నమ్మి ఈ సినిమా మా చేతిలో పెట్టారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను రణ్‌బీర్‌ తండ్రి పాత్ర చేశాను’’ అన్నారు అనిల్‌ కపూర్‌. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ‘డీప్‌ ఫేక్‌ వీడియో’ గురించి రష్మిక మాట్లాడుతూ – ‘‘ఆ వీడియో చూసినప్పుడు ఇలాంటివాటికి రియాక్ట్‌ అయితే ఏమనుకుంటారో అనిపించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సపోర్ట్‌ చేయడంతో.. తప్పకుండా స్పందించాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్‌ కుమార్, నటుడు బాబీ డియోల్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు