ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైలురాయి

2 Nov, 2020 05:24 IST|Sakshi
అర్చన, మాస్టర్‌ రవితేజ, అన్నపూర్ణ

సీనియర్‌ నటి అన్నపూర్ణ, మాస్టర్‌ రవితేజ టైటిల్‌ పాత్రలు పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన జంటగా, సీనియర్‌ నటి జమున ముఖ్య పాత్రలో నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఇటీవల విడుదలైంది. థియేటర్స్‌ ప్రారంభించగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అన్నపూర్ణ మాట్లాడుతూ– ‘‘45 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్‌ పాత్రను ఇంతవరకు చేయలేదు.

‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ నా కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘సీనియర్‌ నటీనటులతో కలసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు మాస్టర్‌ రవితేజ. ‘‘హృదయాలను కదిలించే సన్నివేశాలతో పాటు భావోద్వేగాలున్న పాత్ర నాది’’ అన్నారు అర్చన. ‘‘అమెరికాతో పాటు ఓవర్సీస్‌లో విడుదలైన మా సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివనాగు. ‘‘మా చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.ఎన్‌.ఆర్‌.చౌదరి. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర, విలన్‌ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్‌ ప్రతినిధి రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు