అందుకే ‘పిండం’లో నటించాను: అవసరాల శ్రీనివాస్‌

14 Dec, 2023 08:20 IST|Sakshi

‘‘దర్శకత్వం, నటనల కంటే నాకు రైటింగ్‌ అంటే ఎక్కువ ఇష్టం. నేను ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసినప్పుడు ఆ తరహా చిత్రాలు అప్పుడు రాలేదు. అలానే ‘జో అచ్యుతానంద’ కూడా. ఇలా నా కథలతో నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్‌. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్‌ ఫిల్మ్‌ ‘పిండం’లో అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషించారు. సాయికిరణ్‌ దైదా దర్శకత్వంలో యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘సాయికిరణ్‌  చేసిన ‘స్మోక్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ చూసి, తనలో రచన, దర్శకత్వ ప్రతిభ ఉందని గ్రహించాను. తను చెప్పిన ‘పిండం’ కథ నచ్చింది. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులపై పరిశోధనలు చేసే లోక్‌నాథ్‌ పాత్ర చేశాను. ‘ప్రేమకథా చిత్రమ్‌’ చూసినప్పుడు కొంచెం భయపెడితే ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూస్తారని అర్థమైంది. కానీ కథలో హారర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. అప్పుడే కనెక్ట్‌ అవుతారు.

ఇక ప్రస్తుతం ‘ఈగల్‌’, ‘కిస్మత్‌’, ‘కన్యాశుల్కం’ సినిమాల్లో నటిస్తున్నాను. రైటర్‌గా, దర్శకుడిగా ఓ మర్డర్‌ మిస్టరీ సినిమా స్క్రిప్ట్‌ రాస్తున్నాను. నా తర్వాతి చిత్రం ఇదే కావొచ్చు. అలాగే ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు