శ్రీలంక క్రికెట్‌లో కీలక పరిణామం.. సెలక్షన్‌ కమిటీ ఛైర్మెన్‌గా మాజీ కెప్టెన్

14 Dec, 2023 08:19 IST|Sakshi

శ్రీలంక క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక  జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్‌ కమిటీని ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఏర్పాటు చేశారు. కొత్త కమిటీ నియామకం తక్షణమే అమలు వస్తోందని ఫెర్నాండో బుదవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ సెలక్షన్‌ కమిటీకి శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపికయ్యాడు.

ఈ కమిటీలో తరంగతో పాటు మాజీ ఆటగాళ్లు అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. ఉపుల్ తరంగ నేతృత్వంలోని ఈ సెలక్షన్‌ కమిటీ రెండేళ్ల పాటు శ్రీలంక జట్టు ఎంపికలో కీలకం కానుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగే సిరీస్‌కు జట్టు ఎంపికతో లంక కొత్త సెలక్షన్‌ కమిటీ ప్రయాణం ప్రారంభం కానుంది.

కాగా శ్రీలంక క్రికెట్‌లో ఉపుల్‌ తరంగాకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఓపెనర్‌గా తన జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఓవరాల్‌గా తరంగ మూడు ఫార్మాట్లలో శ్రీలంక తరపున 9వేలకు పైగా  పరుగలు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్‌-2023లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి లంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు.

అయితే  స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని ఐసీసీ  సస్పెండ్ చేసింది. అనంతరం ఐసీసీ లంక క్రికెట్ పై కొన్ని ఆంక్షలను సడలించడంతో ఆ జట్టు యధావిధిగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు గ్రీన్‌ సిగ్నిల్‌ లభించింది.
చదవండిIND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?

>
మరిన్ని వార్తలు