Brahmanandam: తన జీవితాన్ని పుస్తకంగా రాసేసిన బ్రహ్మానందం.. రేటు ఎంతంటే?

29 Dec, 2023 08:44 IST|Sakshi

బ్రహ్మానందం పేరు చెప్పగానే మనలో చాలామంది ముఖంపై ఆటోమేటిక్‌గా నవ్వు వచ్చేస్తుంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోవడం, వయసు అయిపోవడంతో సినిమాలు  బాగా తగ్గించేశారు. ఇలాంటి టైంలో తనలోని వేరే టాలెంట్స్‌ని బయటకు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు అలా ఓ పని చేయగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

బ్రహ్మానందం అనగానే కమెడియన్ అనే గుర్తొస్తుంది. అయితే ఆయనలో మంచి ఆర్టిస్టు కూడా ఉన్నాడు. చాలాసార్లు దేవుడి చిత్రాల్ని తన చేతులతో గీశారు. వాటిని పలువురు హీరోలకు బహుమతిగా ఇచ్చారు. లాక్‌డౌన్ టైంలో బ్రహ్మీలో డ్రాయింగ్ ప్రతిభ బయటపడింది. ఇప్పుడు ఏకంగా ఈయనలో రైటప్ ఉన్నాడని తెలిసింది. 'నేను' పేరుతో తన జీవితాన్నే పుస్తకంగా రాసి ప్రచురించేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

'నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి  మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది. ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార‍్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతిఒక్కరికీ ఈ బుక్ ఇన్సిపిరేషన్ అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీన్ని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని చిరు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇకపోతే ఈ పుస్తకం ధర రూ.275. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇది అందుబాటులో ఉంది. 

(ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)

>
మరిన్ని వార్తలు