భీమవరం దొరబాబుగా చిరంజీవి

30 Jan, 2024 00:08 IST|Sakshi

చిరంజీవి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించడమే. ఇదే జోష్‌లో రెట్టించిన ఉత్సాహంతో తన తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ఆయన హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఆరంభం కానుంది.

ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో భారీ ఖర్చుతో ఓ సెట్‌ ఏర్పాటు చేస్తున్నారట మేకర్స్‌. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సెట్‌ ఉంటుందని, అందుకోసం నిర్మాతలు కూడా భారీగా వెచ్చిస్తున్నారనీ తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారం నుంచి ఈ సెట్‌లో జరిగే షూటింగ్‌లో చిరంజీవి పాల్గొంటారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ఈ సెట్‌లో చిత్రీకరించనున్నారని భోగట్టా. భీమవరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం. దొరబాబు పాత్ర నవ్వుల్ని పంచుతూనే ప్రేక్షకులను మరో కొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళుతుందని తెలుస్తోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు