కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

23 Dec, 2022 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బహుముఖ కళాకారుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పురాణాల నుంచి క్రైమ్‌ థ్రిల్లర్స్‌ వరకు స్పష్టమైన వ్యక్తీకరణలతో విభిన్న పాత్రలను అలవోకగా పోషించిన మహోన్నత వ్యక్తిగా కైకాలను సీఎం జగన్‌ ప్రశంసించారు. 

నటుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన కైకాలది తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక స్థానం అంటూ కొనియాడారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు.

కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

చదవండి: (నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..)

మరిన్ని వార్తలు