Avinash Kolla: దసరా కోసం 500 మంది నివసించే పల్లెటూరు సృష్టించాం

16 Mar, 2023 08:46 IST|Sakshi

‘‘దసరా’ కథకు తగ్గట్టు భారీ విలేజ్‌ సెట్‌ వేశాం. ఇల్లు, స్కూల్, మైదానం, బార్‌.. ఇలా ఐదు వందల మంది నివసించే పల్లెటూరుని సహజంగా సృష్టించాం. 98 శాతం షూటింగ్‌ ఈ సెట్‌లోనే జరిగింది’’ అని ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల అన్నారు. నాని హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ అవుతోంది.

ఈ మూవీ ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల మాట్లాడుతూ– ‘‘నానీ గారితో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలు చేశాను. నాకు పేరు వచ్చే కంటెంట్‌ ఉన్న సినిమాలు నానిగారి వల్లే వచ్చాయి. ఆయన గత సినిమాలతో పోల్చితే ‘దసరా’ చాలా డిఫరెంట్‌ మూవీ. సంస్కృతి పరంగా 25 ఏళ్ల క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. ఈ సెట్‌ కోసం గోదావరిఖని రిఫరెన్స్‌ తీసుకున్నా. దాదాపు 22 ఎకరాల్లో రెండున్నర నెలలు 800 మందికిపైగా పనిచేసి సెట్‌ వేశాం. శ్రీకాంత్‌ ఓదెలకి తొలి సినిమా అయినా అన్ని విషయాలపై చాలా క్లారిటీ ఉంది. ప్రస్తుతం శంకర్‌– రామ్‌ చరణ్‌గారి మూవీ, నానీగారి 30వ చిత్రం, అఖిల్‌ ‘ఏజెంట్‌’ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు