సైకోగా చేయాలని ఉంది!

2 Mar, 2021 23:54 IST|Sakshi

నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. స్వప్న సినిమాస్‌పై ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ – ‘‘మాది హైదరాబాద్‌. మాస్‌ కమ్యూనికేషన్‌  చేశాను. నాకు ఆర్ట్స్‌ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ఆ ఆసక్తితోనే డ్యాన్స్‌, పెయింటింగ్‌ వంటివి నేర్చుకున్నాను. థియేటర్‌ ఆర్టిస్టుగా అనుభవం ఉంది. ‘నక్షత్ర’ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేశాను.

మా కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి దర్శక–నిర్మాత నాగ్‌ అశ్విన్‌ వచ్చారు. ఆ సమయంలో ఆయనతో పరిచయం కలిగింది. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా మన సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఒక వ్యంగ్యాస్త్రంలా ఉంటుంది. థియేటర్‌ ఆర్టిస్టుగా చేసిన అనుభవం కొంతమేరకు సినిమాకి ఉపయోగపడింది. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసినప్పుడే కెమెరాతో లవ్‌లో పడిపోయాను. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నాకు డార్క్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలంటే  ఇష్టం. సైకో పాత్ర చేయాలని ఉంది. సౌత్‌లో నాకు ఫాహద్‌ ఫాజిల్‌ యాక్టింగ్‌ అంటే ఇష్టం. హీరో విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉంది’’ అన్నారు.  

చదవండి: (ప్రతిరోజూ మొదటి రోజే: సమంత) 

మరిన్ని వార్తలు