Vishal New Movie: మార్క్‌ ఆంటోనీ తర్వాత కమర్షియల్‌ దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చిన విశాల్‌

17 Oct, 2023 06:53 IST|Sakshi

మార్క్‌ ఆంటోనీ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టిన విశాల్‌.. తాజాగా కొత్త చిత్రానికి కమిట్‌ అయ్యారు. ఇంతకుముందు విశాల్‌ కథానాయకుడిగా భరణి, పూజ సినిమాలకు దర్శకత్వం వహించిన కమర్షియల్‌ దర్శకుడు హరి ఇప్పుడు మూడోసారి డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇది విశాల్‌ నటిస్తున్న 34వ చిత్రం. ఇందులో నటి ప్రియా భవానీ శంకర్‌ నాయకిగా నటిస్తుండగా దర్శకుడు సముద్రఖని, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీన్ని జి స్టూడియోస్‌ సౌత్‌ సంస్థతో కలిసి దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తన స్టోన్‌ పెంచి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

గత 20 రోజులుగా జరుగుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూత్తుకుడి జిల్లా విళాత్తికుళం పరిసర ప్రాంతాల్లో చిత్ర క్లైమాక్స్‌ సన్నివేశాలను దర్శకుడు హరి చిత్రీకరిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ముఖ్య పాత్రను పోషిస్తున్ననట్లు నటుడు విశాల్‌ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు దర్శకులతో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ సంఖ్య వచ్చే ఏడాది నాలుగు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మధ్యలో ఆగిపోయిన డిటెక్టెవ్‌- 2 చిత్రాన్ని దర్శకుడిగా విశాల్‌నే హ్యాండిల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా విశాల్‌, హరి కాంబోలో రూపొందుతున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు హరి అంటేనే మాస్‌ మసాలా చిత్రాలకు కేరాఫ్‌. మరి ఈయన విశాల్‌తో తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం హ్యాట్రిక్‌ సాధిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు