టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీవో పార్కులో ఏర్పాటుచేసిన నటశేఖరుడి విగ్రహాన్ని అభిమానుల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్,విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. ఆయన ప్రిన్స్ మహేశ్ బాబు- కృష్ణ అభిమానుల ఆహ్వానం మేరకు కమల్ హాసన్ అక్కడకు హాజరయ్యారు. గత రెండురోజులుగా ఇండియన్-2 చిత్రం షూటింగ్ విజయవాడలో జరుగుతుంది.
సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కమల్ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారికి కృష్ణ కుటుంబ సభ్యులు తరపున దేవినేని ఆవినాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో కృష్ణ -మహేశ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.
తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దేవినేని అవినాష్. అయన నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటు ప్రజలకు సేవ చేస్తూ.. కృష్ణ గారి గౌరవాన్ని నిలబెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజల తరపునే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున కమల్ హాసన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.