Adivi Sesh: సొంతం మూవీలో పెద్ద రోల్‌ అన్నారు, చివరికి 5 సెకన్లున్నానంతే!

12 May, 2022 21:20 IST|Sakshi

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం మేజర్‌. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించాడు. మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ మూవీ జూన్‌ 3న రిలీజ్‌ కానుంది. ఇటీవలే (మే 9న) మేజర్‌ ట్రైలర్‌ రిలీజవగా దానికి విశేష స్పందన లభిస్తోంది. 

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్‌ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నా అసలు పేరు అడివి సన్నీ కృష్ణ.. కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్‌ అని ఆటపట్టిస్తుండటంతో అడివి శేష్‌గా మారాను' అని తెలిపాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్‌ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్‌, పెట్రోల్‌ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్‌ హీరో అవలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయిన ఇండియన్స్‌ కమెడియన్‌ రోల్స్‌లోనే కనిపిస్తారు' అని తెలిపాడు.

'చందమామ సినిమాలో ఒరిజినల్‌ హీరో నేను. నవదీప్‌ స్థానంలో నేను ఉండాల్సింది. రెండు రోజుల షూటింగ్‌ తర్వాత సినిమా క్యాన్సిల్‌ అయింది. ఆ తర్వాత సొంతంలో పెద్ద రోల్‌ ఉందన్నారు. కట్‌ చేస్తే సినిమాలో ఐదు సెకన్లున్నానంతే!' అని చెప్పుకొచ్చాడు. మేజర్‌ సినిమా గురించి చెప్తూ అందరికీ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఎలా చనిపోయాడో తెలుసు, కానీ ఎలా బతికాడనేది తెలియదని, అదే తమ సినిమా తెలియజేస్తుందన్నాడు. ఈ సినిమాకు మహేశ్‌బాబు బ్యాక్‌బోన్‌ అని, ఆయన వల్లే సినిమా సాధ్యమైందని పేర్కొన్నాడు.

చదవండి: సౌత్‌ డైరెక్టర్‌ అలా ప్రవర్తించడంతో ఏడుస్తూనే ఉండిపోయా

డ్యాన్స్‌ షో విన్నర్‌ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్‌ ఎక్కువవడం వల్లే..

మరిన్ని వార్తలు