బిగ్‌ బాస్‌లో మొదలైన ప్రేమ.. 'మతం' వల్ల బ్రేకప్‌

7 Dec, 2023 11:00 IST|Sakshi

పాపులర్ రియాల్టీ షో అయిన 'బిగ్ బాస్' ద్వారా అసిమ్ రియాజ్, హిమాన్షి ఖురానా పాపులర్‌ అయ్యారు. హిందీలో 13వ సీజన్‌లో వీరిద్దరూ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. హిమాన్షి ఖురానా ఆ సీజన్‌ ప్రారంభంలోనే ఎలిమినేట్‌ కాగా.. అసిమ్ రియాజ్ మాత్రం రన్నర్‌గా నిలిచాడు. అలా వారిద్దరూ  సుమారుగా 3 ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగారు. తాజాగా వీరిద్దరి ప్రేమ బ్రేక్‌ అయింది. ఇదే విషయాన్ని సినీ నటి,సింగర్‌ అయిన హిమాన్షి ఖురానా అధికారికంగా తెలిపింది. అసిమ్ రియాజ్‌తో తన రిలేషన్‌షిప్‌కు  ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. వివిధ మత విశ్వాసాల కోసం ప్రేమను త్యాగం చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

హిమాన్షి ఖురానా ఏం చెప్పిందంటే
సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకుంటూ, హిమాన్షి ఖురానా ఇలా తెలిపింది. 'అవును, మేము ఇకపై కలిసి ఉండాలని అనుకోవడం లేదు. మేము కలిసి గడిపిన సమయమంతా అద్భుతమైనది. కానీ మా బంధం ముగిసింది. మా రిలేషన్‌షిప్‌ ప్రయాణం చాలా అద్భుతమైనది. మేము మా ప్రత్యేక జీవితాలలో ముందుకు సాగుతున్నప్పుడు. మా విభిన్న మత విశ్వాసాల కోసం మేము మా ప్రేమను త్యాగం చేస్తున్నాము.' అని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరూ వారి గోప్యతను గౌరవించాలని కూడా ఆమె కోరుతూ.. తమ గోప్యతను కూడా అందరూ గౌరవించాలని కోరుతున్నట్లు అభిమానులను అభ్యర్థించింది.

(ఇదీ చదవండి: ‘హాయ్‌ నాన్న’ మూవీ రివ్యూ)

హిమాన్షి ఖురానా పంజాబీ సిక్కు కుటుంబానికి చెందినది కాగా... అసిమ్ రియాజ్ ముస్లిం మతానికి చెందిన జమ్మూ ప్రాంత వాసి. వీరిద్దరూ 'బిగ్ బాస్ 13'లో కలుసుకున్న తర్వాత  ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. 'బిగ్‌బాస్‌' నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేమ పక్షులుగా గుర్తింపు పొందారు. చాలా ప్రేమ పాటల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో పోస్ట్‌లో హిమాన్షి ఖురానా ఇలా తెలిపింది. ' మా ప్రేమను కాపాడుకునేందుకు మేము ఇద్దరం ప్రయత్నించాము. కానీ, అందుకు పరిష్కారం కనుగొనలేకపోయాము. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం.. అయినప్పటికీ కలిసి జీవించేందుకు అదృష్టం లేదు. మా మధ్య ఎలాంటి ద్వేషం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. దీనిని పరిణతి చెందిన నిర్ణయం అంటారని భావిస్తున్నా.' అని తెలిపింది. మత విశ్వాసాల కోసం మాత్రమే తమ ప్రేమను త్యాగం చేశామని వారు ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు