అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం

10 Nov, 2023 04:02 IST|Sakshi

దర్శకుడు రాజు మురుగన్‌

‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్‌గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్‌’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.

‘జపాన్‌’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్‌ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘జపాన్‌’. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్‌ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్‌గారే స్ఫూర్తి.

మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్‌’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌గార్ల సహకారంతోనే ‘జపాన్‌’ చిత్రం ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు