ఫిల్మ్‌ ఫేర్‌కి జాతీయ రహదారి

8 Feb, 2021 05:41 IST|Sakshi

నరసింహనంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్‌ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్‌ దక్షిత్‌ రెడ్డి, అభి, శ్రీనివాస్‌ పసునూరి నటించారు. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ ‘జాతీయ రహదారి’ చిత్ర దర్శక, నిర్మాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ–‘‘రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని, 101వ సినిమా ‘జాతీయ రహదారి’ తో ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం.

ఈ సినిమాకి నరసింహ నంది లాంటి డైరెక్టర్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం చాలా గొప్ప విషయం. తెలుగు చిత్రసీమలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. తమిళంలో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా, మలయాళంలో తీసిన ‘జల్లికట్టు’ సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కి వెళ్లాయి. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు